: తమిళనాడు గవర్నర్‌గా సుష్మాస్వరాజ్.. కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి మరో పదవి!

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తమిళనాడు గవర్నర్‌గా వెళ్లనున్నారా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కేబినెట్‌లో మరో బెర్త్ లభించబోతోందా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఈనెల 27న కేబినెట్‌ను విస్తరించాలని ప్రధాని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కీలక శాఖల్లో భారీ మార్పులు చేయాలని భావిస్తున్న ప్రధాని ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్‌ను తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌గా పంపితే బాగుంటుందన్న ఆరెస్సెస్ నేతల సూచనకు మోదీ ఓకే చెప్పినట్టు తెలిసింది. జూన్, జూలై నెలల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల కోసం కసరత్తు చేయాల్సి ఉండడంతో ఆలోగానే పార్టీలోను, ప్రభుత్వంలోను భారీ మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నమోదీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిత్రపక్షమైన శివసేన మద్దతు పొందేందుకు ఆ పార్టీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే మరో మిత్రపక్షమైన తెలుగుదేశం నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి ఇప్పటికే అశోక్‌గజపతి రాజు, సుజనా చౌదరిలు కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన టీడీపీ ఎంపీ, కాపు సామాజిక వర్గానికి చెందిన మరో ఎంపీ మంత్రి వర్గంలో చోటు లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. వీరిలో ఒకరికి బెర్త్ ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News