: హార్డిక్ పాండ్య బాదుడుకి బాధితుడిగా మారిన అశోక్ దిండా

ఐపీఎల్ సీజన్-10 దూకుడుగా ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాదు ప్రారంభించిన దూకుడును కొనసాగిస్తూ ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకి పార్థివ్ పటేల్ (19), జోస్ బట్లర్ (38) శుభారంభం ఇచ్చారు. పార్థివ్ ను తాహిర్ అద్భుత బంతితో పెవిలియన్ కు పంపగా, కెప్టెన్ రోహిత్ శర్మ (3) ను క్రీజులో కుదురుకోనీయకుండా తాహిర్ బౌల్డ్ చేశాడు. అనంతరం మంచి జోరుమీదున్న బట్లర్ ను కూడా పెవిలియన్ కు పంపాడు. తరువాత అంబటి రాయుడు (10) ను భాటియా క్యాచ్ తో అవుట్ చేశాడు. ధాటిగా ఆడిన రానా (38)ను జంపా పెవిలియన్ కు పంపాడు. తరువాత క్రునాల్ పాండ్య (3) ను భాటియా అవుట్ చేశాడు. ఈ సమయంలో పొలార్డ్ (27) రానాతో కలిసి దూకుడుగా ఆడాడు.

పోలార్డ్ ను బెన్ స్టోక్స్ అవుట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన హార్డిక్ పాండ్య విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అశోక్ దిండాకు చుక్కలు చూపించాడు. తొలి బంతిని సిక్సర్ బాదిన పాండ్య, మలి బంతిని కూడా బౌండరీ లైన్ దాటించాడు. మూడో బంతిని కూడా అదే రీతిన ఆడియన్స్ దగ్గరకు పంపాడు. దీంతో వరుసు సిక్సర్లతో బెంబేలెత్తిన దిండా వైవిధ్యమైన బంతిని సంధించాడు. దానిని ఫోర్ గా మలచిన పాండ్య, ఐదో బంతిని మళ్లీ సిక్సర్ బాదాడు. దీంతో స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ ఓవర్ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్ ను గుర్తుతెచ్చింది. ఈసారి బాధితుడు దిండా అనిపించింది. అయితే చివరి బంతిని వైడ్ గా వేయడంతో మరో ఎండ్ లో ఉన్న సౌతీ తొందరపడి పరుగుతీసి రనౌట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పూణే సూపర్ జెయింట్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ మూడు వికెట్లతో రాణించగా, భాటియా రెండు, జంపా, బెన్ స్టోక్స్ చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 

More Telugu News