: మగవారి కంటే మహిళలే మాంసాహారాన్ని అధికంగా లాగించేస్తున్నారట.. సర్వేలో ఆసక్తికర విషయాలు!

ఆహార ప్రియులు అత్య‌ధికంగా ఉండే భారత్‌ లాంటి దేశంలో మాంసాహారాన్ని భుజించే వారు ఎంత మంది ఉన్నార‌నే అంశంపై జ‌రిగిన ఓ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. ‘రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ బేస్‌లైన్‌’ 2014లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం భార‌త్‌లో 29 శాతం మంది శాకాహారులున్నారు. ఇక‌ 71 శాతం మంది మాంసాహారులే. జీవ హింస వ‌ద్దంటూ, శాకాహారం ఉత్తమమైనదంటూ శాకాహార ప్రోత్సాహక సంస్థలు చేసిన ప్ర‌చారం ఫ‌లితంగా 2004 నుంచి 2014 మ‌ధ్య కాలంలో నాలుగు శాతం మంది శాకాహారులు పెరిగారు. మాంసం ముట్ట‌ని వారు దేశంలో వాయవ్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు.

ఇక‌ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే శాకాహారులు అధికం. భార‌త్‌లో అగ్రవర్ణాల్లోనే శాకాహారులు ఎక్కువగా ఉండగా, వారిలో బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. బ్రాహ్మణుల్లో మొత్తం యాభై శాతం మంది శాకాహారులు ఉన్నారు. కాగా, మొత్తం మాంసాహారుల్లో ఎస్సీ, ఎస్టీల సామాజిక వ‌ర్గానికి చెందిన వారే అధికం. ఎస్సీ, ఎస్టీల్లోని మాంసాహారుల్లోనూ మహిళలే అధికంగా ఉన్నారు. దేశంలో మొత్తం మాంసాహారుల్లో మహిళలు 71.6 శాతం కాగా, పురుషులు 70.7 శాతం ఉన్నారని స‌ర్వేలో వెల్ల‌డైంది. ఎస్సీలలో మాంసాహారులు పురుషులలో 76. 1 ఉన్నార‌ని, మహిళలలో 77.9 శాతం ఉన్నార‌ని తేలింది. ఇక‌ ఎస్టీల్లో పురుషులు 75.9 శాతం కాగా, మహిళలు 76 శాతం మంది ఉన్నారని వెల్ల‌డైంది. మాంసాహారంలో ఉండే పోష‌క విలువ‌ల కార‌ణంగానే వారు మాంసాహారాన్ని లాగించేస్తున్నారట.  

More Telugu News