: రోహిత్ శర్మ వర్సెస్ స్టీవ్ స్మిత్...శుభారంభానికి రెండు జట్లు సిద్ధం

ఐపీఎల్ షురూ అయిపోయింది. క్రికెట్ ప్రియులను అలరించే ఈ సీజన్ ఐపీఎల్ తొలి ఏడు మ్యాచ్ లను వేడుకలతో ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదులో శుభారంభం చేసిన ఐపీఎల్... రెండో రోజు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ముంబైలో రెండో రోజు వేడుకలు జరగనున్నాయి. సెలబ్రిటీ డాన్స్ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాల అనంతరం రెండో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ లో రెండు మరాఠా జట్లు పోటీ పడనున్నాయి. గతేడాది పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్లిపోయిన పూణే సూపర్ జెయింట్స్ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈసారి కొత్త కెప్టెన్ తో పూణే కొత్తగా బరిలో దిగనుంది. పూణే జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, అజింక్యా రహానే అదిరే ఫాంలో ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి సత్తాచాటాలని భావిస్తున్నాడు. వీరికి ఐపీఎల్ లో ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్, డుప్లెసిస్ జతకలిస్తే స్కోరు బోర్డు జెట్ స్పీడందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ముంబై ఇండియన్స్ లో గత సీజన్ లో జట్టును విజయాల బాటపట్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడు. రాయుడు, పొలార్డ్, సౌరవ్ తివారీ, పార్థివ్ పటేల్, హార్డిక్ పాండ్యలపై బ్యాటింగ్ భారం ఉంది. బౌలింగ్ లో ముంబై ఇండియన్స్ కు పూర్తి వనరులు అందుబాటులో ఉన్నాయి. దీంతో బ్యాట్స్ మన్ రాణిస్తే, బౌలర్లు పని పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో రెండు జట్లు తొలి మ్యాచ్ ను ఘనంగా ప్రారంభించనున్నాయి. 

More Telugu News