: రూ. 350 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ ను కోరిన కవిత.. సానుకూలంగా స్పందించిన అన్న!

నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ తో కలసి హాజరైన కవిత, తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 350 కోట్లు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ కు పరిశ్రమలు తెచ్చేలా, ఇక్కడి నుంచి వెళ్లి ఎన్నారైలుగా వివిధ దేశాల్లో కీర్తి ప్రతిష్ఠలు గడించిన వారితో చర్చించి, ఒప్పించాలని అన్నను కోరారు. నిజామాబాద్ లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అవసరం తనకుందని, కొన్ని అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేసిన ఆమె, వాటి సత్వర పూర్తికి నిధులందించాలని అడిగారు.

తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ధికీ టీఆర్ఎస్ కృషి చేస్తోందని, రైతులకు నాణ్యమైన విద్యుత్ ను 9 గంటల పాటు అందిస్తున్నామని తెలిపారు. ఆపై సోదరి కవిత కోరికపై స్పందించిన కేటీఆర్, జిల్లా మునిసిపాలిటీలకు రూ. 350 కోట్ల నిధులను దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నూతన పరిశ్రమల స్థాపన దిశగా, పారిశ్రామికవేత్తలతో స్వయంగా మాట్లాడుతానని అన్నారు. ఎన్నారైలతో చర్చించి కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలను అందిస్తానని తెలిపారు. 

More Telugu News