: సుబ్రతోరాయ్, విజయ్ మాల్యాలకన్నా గొప్పవాడు జగన్: చంద్రబాబు చురకలు

ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు సేకరించి జైలుకెళ్లిన సుబ్రతోరాయ్ లకన్నా జగన్ గొప్పవాడని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని వెనకేసుకున్నాడని, అందుకే జైలుకు కూడా వెళ్లి వచ్చాడని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నేడు గుంటూరులో బాబూ జగ్జీవన్ రామ్ 110వ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి లేదని అన్నారు.

తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే అహర్నిశలూ కృషి చేస్తున్నానని, ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని, అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ ను వదిలి కట్టుబట్టలతో రావాల్సి వచ్చేలా చేసిందని మరోసారి విమర్శలు గుప్పించిన ఆయన, అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, బాలయోగి, ప్రతిభా భారతి వంటి ఎందరో దళితులకు పెద్ద పదవులు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.

More Telugu News