: ఓ గడుగ్గాయి అధర్మం చెబుతున్నాడు... ఇదే హెచ్చరిక!: భద్రాచల కల్యాణంలో వేదపండితుల సంచలన వ్యాఖ్యలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం జరుగుతున్న వేళ, కామెంట్రీ చెబుతున్న వేద పండితుల నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. శ్రీరామనవమి, స్వామివారి కల్యాణం ఎప్పుడు జరుపుకోవాలన్న విషయమై ఓ పంచాంగకర్త తప్పుడు నిర్ణయాలు చేస్తున్నాడని పురోహితులు బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. తమది ఒక్కొక్క నిర్ణయం చాలా సునిశితమైన పరిశీలనలతోనే చేసి సమయాన్ని నిర్ణయించే పవిత్ర పుణ్యస్థలం భద్రాచలమని వేద పండితులు వ్యాఖ్యానించారు. దేవాలయం పాటించే అర్చన, ఆగమ పద్ధతులను బట్టి, సంప్రదాయాన్ని బట్టి నిర్ణయాల్లో మార్పులు ఉంటాయని, ధర్మశాస్త్రాన్ని అనుసరించి చాలా నిర్ణయాలు చేసినా, ఏకాదశి తిథి నిర్ణయం, శ్రీరామనవమి నిర్ణయం చాలా సూక్ష్మంగా పరిశీలించి చేసినవేనని తెలిపారు.

"అన్ని రకాల ప్రమాణాలతో సిద్ధాంతీకరించే చోటు భద్రాచల క్షేతం. ఇక్కడ రామచంద్ర ప్రభువుకు కల్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి నాడే కాదు... నిత్య కల్యాణం కూడా ధర్మ ప్రభువుకు జరుగుతుంది. అలాంటిది ఈ మధ్యన ఓ సిద్ధాంతి... గడుగ్గాయి... ధర్మ ప్రభువుకు అధర్మంగా కల్యాణమంటూ తన పంచాంగంలో వేయడమన్నది... ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. వైదిక సందేహాలుంటే అడగాలి. ధర్మ ప్రభువుకు అధర్మ కల్యాణమేంటి? కల్యాణమెప్పుడూ అధర్మం కాదని అతను గుర్తించాలి. ధర్మప్రభువుకు అమావాస్య నాడు కల్యాణం జరిగినా అది జగత్కల్యాణమే కదా? (ఈ సమయంలో భక్తుల నుంచి చప్పట్లతో కూడిన హర్షధ్వానాలు వినిపించాయి) అలాంటిది శ్రీరామనవమి నిర్ణయం తెలియక, సంప్రదాయం తెలియక, ఆగమం తెలియక ఇక్కడి పద్ధతులు తెలియక, ఈ రకంగా ప్రచారం చేయడాన్ని ఈ వేదిక నుంచి ఖండిస్తున్నాం. ఆ సిద్ధాంతిని పద్ధతి తెలుసుకోవాలని మరోసారి హెచ్చరిస్తున్నాం" అన్నారు.

More Telugu News