: అందుకే 9 నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను: పరిణీతి చోప్రా

రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ యువనటి పరిణీతి చోప్రా...'డిష్యూం' సినిమాలో అతిథి పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. దీంతో గతంలో ముద్దుగా, బొద్దుగా ఉన్న పరిణీతిలో వచ్చిన మార్పు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అనంతరం 'మేరీ ప్యారీ బిందు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా పరిణీతి చోప్రా మాట్లాడుతూ, జీవితంలో చాలా ముఖ్యమైన సమయంలో విరామం తీసుకున్నానని చెప్పింది. ఈ విరామ సమయంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.

మూడేళ్లు వరుసగా సినిమాల్లో నటించినప్పటికీ సంతృప్తి ఉండేది కాదని చెప్పింది. విరామ సమయంలో కెరీర్‌ పై ఆత్మపరిశీలన చేసుకుంటే నటనపరంగా, లుక్స్‌ పరంగా మెరుగవడం అవసరమనిపించిందని తెలిపింది. అందుకే దాదాపు 9 నెలల పాటు షూటింగులకు పూర్తిగా దూరంగా వున్నానని చెప్పింది. ఇప్పుడు తనలో చాలా మార్పులు వచ్చాయని, నూతనోత్తేజంతో పనిచేయగలుగుతున్నానని చెప్పింది. గతంలో కంటే ఆనందంగా, మెరుగ్గా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని, దీంతో తనకు చాలా బాగా నిద్రపడుతోందని పరిణీతి చెబుతోంది. 

More Telugu News