: తొలి మ్యాచ్ లో గట్టెక్కేదెలా? ఆర్సీబీలో ఆందోళన!

ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని గంటలే ఉన్న వేళ, తొలి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టును ఎదుర్కోవాల్సిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక్కొక్కరుగా స్టార్ ప్లేయర్లు దూరం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా కోహ్లీ కొన్ని మ్యాచ్ లను ఆడే అవకాశం లేదని తెలుస్తున్న వేళ, మరో కీలక ఆటగాడు డివిలియర్స్ సైతం గాయాలతో బాధపడుతున్నాడు. మరో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ ఆడబోడని ఇప్పటికే బీసీసీఐ వైద్యులు వెల్లడించారు. ఇక 9వ సీజన్ లో లోయర్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడి మార్కులు కొట్టేసిన సర్ఫరాజ్ ఖాన్ సైతం ఇప్పుడు జట్టుకు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా, ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ గాయపడగా, వైద్యుల సలహా మేరకు ఈ ఐపీఎల్ పోటీలకు అతన్ని దూరం పెట్టినట్టు ఆర్సీబీ ప్రకటించింది. కోహ్లీ అందుబాటులో లేకుంటే డివిలియర్స్ ను కెప్టెన్ గా ప్రకటించిన జట్టు, ఇప్పుడు షేన్ వాట్సన్ కు పగ్గాలు అప్పగించింది. స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో, ఈ సంవత్సరం బెంగళూరు జట్టుకు కష్టాలు తప్పేలా లేవు.

More Telugu News