: పదవులు కాదు, పార్టీ మనుగడ ముఖ్యం: ఎమ్మెల్యే యరపతినేని

పదవులు కాదు, పార్టీ మనుగడ ముఖ్యం అని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గంలో తనకు చోటు దక్కలేదని తానేమీ బాధపడట్లేదని, మంత్రి వర్గ విస్తరణపై వైఎస్సార్సీపీ నేతలవి అర్థరహిత ఆరోపణలని అన్నారు. చంద్రబాబు కృషి, పట్టుదలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, దేశంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడు చంద్రబాబు అని ఆయన ప్రశంసించారు.

కులాలు, ప్రాంతాలను సమతుల్యం చేస్తూ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పదవులు ఆశిస్తారని, ఆ పదవులు దక్కకపోతే విచారం వ్యక్తం చేయడం సర్వసాధారణమన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీ పెట్టకపోతే తమ లాంటి వారు ఎక్కడ ఉండేవాళ్లోనని, పదవులు రాని వారు పార్టీని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దని యరపతినేని హితవు పలికారు. నలభై ఏళ్లుగా రాని నిధులు చంద్రబాబు దయతో ఇప్పుడు వచ్చాయని, అవగాహన లేని ప్రతిపక్ష నేత జగన్ తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. కాగా, మంత్రి పదవి రాకపోయినప్పటికీ యరపతినేని ఎంతో హుందాగా ప్రవర్తించారంటూ సీఎం చంద్రబాబు ఆయన్ని ప్రశంసించడం విదితమే.

More Telugu News