: నన్ను గెలిపిస్తే, స్వచ్ఛమైన గోమాంసం సరఫరాకు చర్యలు చేపడతా: కేరళ బీజేపీ నాయకుడు

యూపీ, గుజరాత్ లలో గోమాంసం విక్రయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఓపక్క అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధం విధించాయి. అయితే, కేరళలోని మలప్పురం లోక్ సభ నియోజకవర్గానికి కొద్దిరోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎన్.శ్రీప్రకాశ్ ఈ సందర్భంగా ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే స్వచ్ఛమైన గోమాంసం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు రాజకీయంగా విమర్శలకు దారి తీశాయి. గోహత్యకు పాల్పడే వారిని, గోమాంసం విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించిన దానికి భిన్నంగా ఆ పార్టీ నాయకుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

More Telugu News