: నన్ను దారుణంగా మోసం చేశారు: టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల ఆవేదన
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు పదవి దక్కకపోవడంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని, కన్నా లక్ష్మీనారాయణపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తనకు గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని, తనను దారుణంగా మోసం చేశారని ఆయన వాపోయారు. పార్టీలు మారిన వారికి, నాలుగు సార్లు ఓడిపోయిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.