: ముగిసిన లోకేష్ ప్రమాణ స్వీకారం... ఆపై వరుసగా ప్రమాణాలు

ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ లోకేష్ తో ప్రమాణం చేయించారు. తన ప్రమాణ స్వీకారం అయిపోయిన తరువాత, తండ్రి చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్న లోకేష్ ను గవర్నర్ అభినందించారు.

ఆపై పితాని సత్యనారాయణ ప్రమాణం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన పితాని, గతంలోనూ మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆపై గుంటూరు జిల్లా సిరిపురంలో జన్మించి, ప్రస్తుతం వేమూరు ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న నక్కా ఆనంద్ బాబు ప్రమాణం చేశారు. బీఏ బీఎల్ విద్యను అభ్యసించిన ఆనంద్ బాబు, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తరువాత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పనిచేసిన చరిత్ర, నెల్లూరు జిల్లా టీడీపీలో గట్టి పట్టున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు జిల్లా అల్లిపురం గ్రామంలో ఆయన జన్మించారు.

ఆపై విజయనగరం జిల్లా నేత సుజయకృష్ణ రంగారావు ప్రమాణ స్వీకారం చేశారు. బొబ్బిలి రాజ వంశీకుడైన రంగారావు, బీఏ విద్యను అభ్యసించి, ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అనంతపురం జిల్లా కేకే అగ్రహారం గ్రామంలో జన్మించిన కాల్వ శ్రీనివాసులు, ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా సేవలందిస్తూ, నేటి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. కాల్వ నిన్నటివరకూ ప్రభుత్వ విప్ గా పనిచేశారు. గతంలో ఓ మారు ఎంపీగానూ సేవలందించారు.

ఆ తరువాత కడప జిల్లా దేవగుడి గ్రామంలో జన్మించిన చదిపిరాల ఆదినారాయణరెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఎమ్మెస్సీ చదివిన ఆదినారాయణ రెడ్డి, ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, అంతకుముందు లెక్చరరుగా కూడా పనిచేశారు.

ఆపై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ మంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గానుగపాడులో జన్మించిన జవహర్, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకపూర్వం టీచర్ గానూ పనిచేశారు.

తరువాత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ అమర్ నాథ్ రెడ్డి ప్రమాణం చేశారు. చిత్తూరు జిల్లా కెళావతిలో పుట్టిన ఆయన, ప్రస్తుతం పలమనేరు ఎమ్మెల్యేగా వున్నారు. గతంలో ఒకసారి చిత్తూరు ఎంపీగానూ పనిచేశారు.

ఆపై ప్రస్తుత క్యాబినెట్ లో అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డును సృష్టిస్తూ, 28 ఏళ్ల వయసులోనే భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియ, తల్లి శోభ మృతితో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

More Telugu News