: చంద్రబాబు నిర్ణయం విని హతాశులైన రావెల, పీతల!

"కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించాల్సి వస్తోంది" అని చంద్రబాబు చెప్పిన మాటలు విని మంత్రులు రావెల కిశోర్ బాబు, పీతల సుజాతలు హతాశులైనట్టు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. తమను కొనసాగించాలని వారు మొరపెట్టుకున్నా అధినేత వినలేదు. గుంటూరు జిల్లాలో జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ తో నెలకొన్న వివాదం నేపథ్యమే ఆయన పదవికి ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక పీతల సుజాత విషయానికి వస్తే, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆమెను వ్యతిరేకిస్తుండటం, శాఖపై పట్టు సాధించలేకపోవడమే ఆమెను తొలగించడానికి కారణమని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. వయసు మీదపడటం, ఆరోగ్య కారణాలతో చిత్తూరు జిల్లా నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తొలగించగా... కళా వెంకట్రావును మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో, ఆయనకు దగ్గరి బంధువైన కిమిడి మృణాళినిని సమీకరణాల నేపథ్యంలో తొలగించాల్సి వచ్చినట్టు సమాచారం. పల్లె రఘునాథ్ రెడ్డి విషయానికి వస్తే, మంత్రిగా తొలగించినా, విప్ పదవిని ఇచ్చి ఆయన సేవలను వినియోగించుకుంటామన్న సంకేతాలను ఇచ్చారు. ఇక వైకాపా నుంచి ఫిరాయించిన వారిలో మంత్రి పదవులను ఆశించిన జ్యోతుల నెహ్రూ, చాంద్ బాషా తదితరులు సైతం తమకు పదవులు దక్కలేదని తీవ్ర నిరాశలో మునిగారు.

More Telugu News