: అమెరికాలో ఫేస్ బుక్ పై నిషేధం దిశగా డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌నకు ఫేస్ బుక్ టార్గెట్‌గా మారింది. త‌మ దేశ వ్యాప్తంగా ఆ సోష‌ల్ మీడియా సైట్ వాడ‌కంపై నిషేధం విధించ‌డానికి ఆయ‌న సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఫేస్‌బుక్‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంత‌కం చేయ‌నున్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు.

అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని కొంత‌మంది రిపబ్లికన్‌ లీడర్లు అంగీక‌రించ‌డం లేదు. ఈ విష‌య‌మై తమ నేత‌ల‌తో ట్రంప్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారని సంబంధిత అధికారులు తెలిపారు. ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ తాము కూడా ఈ అంశంపై ప‌లు నిర్ణయాలు తీసుకోవడం పాలనలో భాగమని ట్రంప్ అన్నారని పేర్కొన్నారు.

మ‌రోవైపు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లపై మాత్రం ఆయ‌న ఎటువంటి చర్య‌లు తీసుకోవ‌డం లేదు. ట్రంప్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఇప్పటికే  పెద్ద ఎత్తున ఫేస్ బుక్ యూజర్లు ఆందోళన తెలిపారు. ట్రంప్ ఇందుకు సంబంధించిన ఆర్డ‌ర్‌ను జారీ చేస్తే తాము దానికి మద్దతిస్తామని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అన్నారు. దీనిపై ఫేస్ బుక్  సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ... అమెరికాలో ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేసినప్పటికీ కాలిఫోర్నియా నుంచే తమ ఆపరేషన్లు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే, ఫేక్ న్యూస్ ప్ర‌చారానికి వ్య‌తిరేకంగా పోరాటం చేసే పద్ధతి ఇది కాదని ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

More Telugu News