: తవ్వేకొద్దీ ఆస్తులు...బయటపడ్డవి 100 కోట్ల పైమాటే!

ఏపీ ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.గంగాధర్‌ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గంగాధర్ ఇళ్లతో పాటు రోడ్డు కాంట్రాక్టర్‌ నాగభూషణం, ఇతర బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌ లలో సుమారు 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఒక్క హైదరాబాదులోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కూకట్‌ పల్లి రాంకీ టవర్స్‌ లో 8 కోట్ల ఖరీదైన విల్లాను గుర్తించామని, కూకట్‌ పల్లిలోని వివేకానందనగర్‌ లో ఓ ఇల్లు కూడా వుందని తెలిపారు.

కూకట్‌ పల్లి నివాసంలో 40 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. నాగభూషణం ఇంట్లో 20 లక్షల రూపాయలు సీజ్ చేశారు. అంతే కాకుండా విజయవాడలోని మొగల్రాజపురంలోని ఇంట్లో 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకు లాకర్లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఈ నివాసాల్లో లభ్యమైన డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల అక్రమాస్తులను కనుగొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌ లో కనీసం 100 కోట్ల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరులో 19 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించినట్టు తెలిపారు. అంతే కాకుండా నెల్లూరు జిల్లాలో గంగాధర్ స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు చేసినట్టు వారు వెల్లడించారు. 

More Telugu News