: కడుపులో ఆహారం లేకున్నా... మోదీ కఠోర శ్రమ... ఊపిరిసలపని పనులతో బిజీ!
ప్రధాని నరేంద్ర మోదీ దేవీ వసంత నవరాత్రుల (ఉగాది నుంచి తొమ్మిది రోజుల పాటు) సందర్భంగా కఠిన ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ... ప్రధానిగా ప్రతీ నిమిషాన్నీ ప్రజాసేవలోనే గడుపుతున్నారు. ఉగాది నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల సందర్భంగా ఆయన కేవలం వేడి నీరు, నిమ్మరసం, పాలు, పండ్ల రసాన్ని మాత్రమే తీసుకుంటారు. ఘనాహారాన్ని ముట్టరు. అయినప్పటికీ రానున్న కొన్ని రోజుల పాటు ఆయన ఎన్నో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ భవన్ లో మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆదివారం జమ్మూ కశ్మీర్ లో... జమ్మూ - శ్రీనగర్ మధ్య రవాణాకు కీలకమైన, దేశంలోనే అతి పొడవైన చేనాని-నష్రీ సొరంగ మార్గాన్ని (టన్నెల్) జాతికి అంకితం చేయనున్నారు. ఉధంపూర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సొరంగ మార్గాన్ని ప్రారంభించే ముందు మోదీ అలహాబాద్ లో అలాహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారు. ప్రధాని మోదీకి అమ్మవారంటే పరమ విశ్వాసం. ఆయన వసంత నవరాత్రులతోపాటు, దసరా శరన్నవరాత్రుల (సెప్టెంబర్ లో జరిగే) సమయంలోనూ ఉపవాస దీక్ష ఆచరిస్తారు.