: ఒక్క రోజు కాపురం చేశాడు.. విడాకులు ఇచ్చేస్తున్నాన‌ని చెప్పాడు!

హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రకాశం పంతులునగర్‌ ప్రాంతంలో నివ‌సించే ఓ వ్య‌క్తి రెండో పెళ్లి చేసుకొని, ఒక రోజు కాపురం చేసి ఆ త‌రువాత విడాకులు ఇచ్చేస్తున్నాన‌ని చెబుతూ పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప‌లు వివ‌రాలు తెలిపారు. మహ్మద్‌ హనీఫ్‌ (38), బహదురున్నీసా (32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, మ‌హ్మ‌ద్ త‌న‌కు మ‌గ‌పిల్లాడు కావాల‌ని కోరుకునేవాడు. త‌న భార్య‌కు పలుమార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో రెండో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకొని త‌న‌ భార్యని ఒప్పించాడు.

అనంత‌రం తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్‌ బేగంను గత నెల 9న మొఘల్‌పురాలోని కన్వీల్లా ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. మొద‌టి భార్య నుంచి విడాకులు తీసుకుంటాన‌ని రెండో భార్య‌కు చెందిన వారితో చెప్పాడు. అయితే, రెండో భార్య‌ను కూకట్‌పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంచి, పెళ్లి రోజు రాత్రి ఆమెతో గడిపి ఉద‌యాన్నే వెళ్లిపోయాడు. ఆ తరువాత రెండో భార్య‌కు ఫోన్‌ చేసి తాను అనారోగ్యం కార‌ణంగా ఆసుపత్రిలో చేరానని, ఆమెను తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. విడాకుల ప‌త్రం చూసిన ఫ‌ర్హీన్ షాక్ అయింది. త‌న‌కు పెళ్లి ఇష్టం లేదని, అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నాన‌ని మ‌హ్మ‌ద్ అందులో పేర్కొన్నాడు.

More Telugu News