: దిగ్విజయ్ వల్లే ముఖ్యమంత్రిని అయ్యానన్న పారికర్.. డిగ్గీరాజాకు కృతజ్ఞతలు

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే తాను ముఖ్యమంత్రిని కాగలిగానని అన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. దీంతో ఇతరుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ మార్చి తొలి వారంలో ఆ పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

కాగా, శుక్రవారం జీరో అవర్ సందర్భంగా రాజ్యసభకు వెళ్లిన పారికర్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అందరినీ గోవా రమ్మంటూ ఆహ్వానించారు. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు అందరూ తనకు ఎంతో సహకరించారని ఈ సందర్భంగా పారికర్ పేర్కొన్నారు. గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ గోవాలోనే ఉన్నా ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ఆయన వల్లే తాను సీఎంను కాగలిగానని, ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని చమత్కరించారు. పారికర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు.

More Telugu News