: ప్రధాని కార్యాలయానికి చేరిన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఫైలు

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించిన ఫైలు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. ప్రధాని నరేంద్రమోదీ సూచనలతో ఈ నెలలో బిల్లు పార్లమెంటుకు రానుంది. ఆర్టికల్ 170ని సవరించడం వల్ల
 తలెత్తే లాభనష్టాలతోపాటు విభజన చట్టంలోని సెక్షన్ 26ని సవరిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందుల గురించి వివరిస్తూ కేంద్ర హోంశాఖ ఈ ఫైల్‌ను వారం క్రితమే ప్రధాని కార్యాలయానికి పంపింది.

ప్రధాని  సూచనలకు అనుగుణంగా బిల్లును తయారుచేస్తామని, ఒకవేళ ప్రధాని రాజ్యాంగ సవరణకు మొగ్గుచూపితే దాని ప్రకారం బిల్లులో అంశాలు చేరుస్తామని హోంశాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని సెక్షన్ 3 ప్రకారం 2026 వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పెంపు కుదరదు. అయితే 2014 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలకు సెక్షన్ 3 నుంచి మినహాయింపు ఇస్తూ నాలుగో సెక్షన్‌ను చేరిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే సరిపోతుందని హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News