: ఏపీలో ‘విద్యుత్’ బాదుడు.. ప్రజలపై రూ.800 కోట్ల భారం!

ఏపీ ప్రజలపై విద్యుత్ భారం మోపేందుకు సర్కారు సిద్ధమైంది. 2017-18 సంవత్సరానికి గాను రిటైల్ సరఫరా చార్జీలు పెంచేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి ఇచ్చింది. ఫలితంగా ప్రజలపై రూ.800 కోట్ల మేర భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి (శనివారం) నుంచి అమల్లోకి రానున్నాయి. నెలకు 75 యూనిట్ల లోపు వాడే సామాన్యులపై ఎలాంటి భారం మోపని ప్రభుత్వం 76 యూనిట్లు దాటితే మాత్రం కస్టమర్ చార్జీ కింద నెలకు అదనంగా రూ.10 వసూలు చేయాలని నిర్ణయించింది.

 విద్యుత్, డిమాండ్ చార్జీలను కలిపి మొత్తం రూ.1,127 కోట్ల మేర పెంచేందుకు అవకాశం ఇవ్వాలన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్స్)ల విన్నపంపై స్పందించిన ఈఆర్‌సీ చార్జీల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈఆర్‌సీ సూచనతో అదనంగా రూ.400 కోట్లు ఇచ్చేందుకు సర్కారు అంగీకరించింది. నిజానికి బడ్జెట్‌లో రూ.3,300 కోట్లు మాత్రమే సబ్సిడీ కింద కేటాయించినా రూ.3,700 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సామాన్య, మధ్యతరగతి గృహ వినియోగదారులపై చార్జీలను పెంచేందుకు అంగీకరించని ఈఆర్‌సీ వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు సంబంధించి మాత్రం విద్యుత్ చార్జీతోపాటు డిమాండ్ చార్జీ పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా 3.6 శాతం చార్జీలు పెరిగాయి. కాగా, విద్యుత్ ప్రమాదాల కారణంగా 2015-16లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో రూ.25 కోట్లతో ప్రత్యేకంగా నిల్వ నిధి ఏర్పాటు చేసేందుకు ఈఆర్‌సీ ఆదేశించింది.

More Telugu News