: బంగారం అమ్మితే డబ్బు చేతికివ్వరు... మోదీ సర్కారు కొత్త రూల్!

నగదురహిత భారతావనిని సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్న మోదీ సర్కారు మరో కీలక నిబంధనను అమలు చేయనుంది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన వేళ, ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్ముకుని గట్టెక్కాలని భావించే వారు ఎందరో. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు డబ్బు కూడబెట్టుకుని బంగారాన్ని కొని, ఆపై దాన్ని అవసరాలు తీర్చుకునేందుకు వాడుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక బంగారాన్ని అమ్మితే రూ. 10 వేల లోపైతేనే నగదు చెల్లించవచ్చని, అంతకు మించి డబ్బు ఇవ్వాలంటే, చెక్కు లేదా ఆన్ లైన్ రూపంలోనే చెల్లించేలా కేంద్రం ద్రవ్యబిల్లులో భాగంగా ఓ చట్టాన్ని సవరించింది. ఇది రేపటి నుంచి, అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది.

ఇందులో భాగంగా, రూ. 10 వేలకు మించిన బంగారాన్ని అమ్మితే, చెక్కు లేదా ఆన్ లైన్ లో క్యాష్ జమ చేయాల్సిందే. అంటే, నెత్తిపై సమస్య కూర్చున్న వేళ బంగారాన్ని అమ్మితే, అది తీరే అవకాశాలు తగ్గుతాయి. ఉదాహరణకు ఏదైనా ఆరోగ్య అవసరమో లేక అత్యవసరంగా ఎవరికైనా ఓ లక్ష చెల్లించాల్సి వస్తే, చెక్కు తీసుకుంటే అది క్యాష్ గా మారడానికి 2 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. ఇక ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ అనుకుంటే, దుకాణందారు సదరు డబ్బును కస్టమర్ ఖాతాలోకి వేయాలంటే, ఆ వ్యక్తి ఖాతాను ఎన్ఈఎఫ్టీ లేదా ఐఎంపీఎస్ లో యాడ్ చేసుకుని ట్రాన్స్ ఫర్ చేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. దీంతో పీకల మీదకు వచ్చిన కష్టాన్ని వెంటనే దూరం చేసుకునేందుకు బంగారం అమ్మకం ఆలోచన ఉపకరించదు.

More Telugu News