: సంబరానికి వెళ్లి షాక్ తిన్నారు!

చెన్నైలో చోటుచేసుకున్న ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...చెన్నైలోని కన్నన్ వీధిలో ఉంటున్న ఏ.హబీబుల్లా కుమార్తె రజస్వల అయింది. దీంతో బంధువర్గాన్ని పిలిచి ఆయన ఘనంగా వేడుక నిర్వహించారు. బంధుమిత్రులంతా ఎంజాయ్ చేయడంతో ఆ ఇల్లంతా సందడి సందడిగా మారింది. ఇంతలో తెల్లవారుజామున బీవీ.రసూల్ అనే వ్యక్తి తన రెండు సెల్ ఫోన్లు, బంగారు గొలుసు కనిపించడం లేదని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి బంధుగణం మొత్తం వేలిముద్రలు తీసుకున్నారు. దీంతో అంతా షాకయ్యారు. అందర్నీ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

ఇంతలో ఎందుకైనా మంచిదని చుట్టుపక్కల ఉన్న వారిని హబీబుల్లా, 'ఇంట్లోకి ఎవరైనా రావడం చూశారా?' అంటూ ప్రశ్నించారు. అందులో ఓ మహిళ టెర్రస్ కు వెళ్లే దారిలో ఎస్.షరీఫ్ అనే బంధువు రావడాన్ని తాను చూశానని వెల్లడించింది. దీంతో పోలీసులు అతనిని ప్రశ్నించగా అప్పుల పాలయ్యానని, వాటిని తీర్చేందుకు బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు దొంగతనం చేశానని అంగీకరించాడు. కాగా, షరీఫ్ సన్నగా ఉండడంతో టెర్రస్ పై నుంచి మెట్ల మార్గంలో కిందికి దిగి కిటికీ గుండా గదిలోకి ప్రవేశించి దొంగతనం చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో వేడుకలకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. 

More Telugu News