: ఎన్ కౌంటర్ జరిగే చోటకు రావద్దు... ప్రాణాలు పోగొట్టుకోవద్దు... జమ్మూ కశ్మీర్ పోలీసుల సూచన

ఎన్ కౌంటర్ జరిగే చోటకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వే యువకులు అనవసరంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర డీజీపీ ఎస్.పి.వైద్ అన్నారు. ఎన్ కౌంటర్ జరిగే చోటకు రావద్దని రాజకీయ ప్రయోజనాల కోసం వారిని కొందరు వినియోగించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

‘‘యువకులు ఇళ్లల్లోనే ఉండాలి. ఎన్ కౌంటర్ జరిగే చోటకు రావద్దు. ఎవరు వస్తున్నారు, ఎవరికి తగులుతుంది? అన్నది బుల్లెట్ చూడలేదు. ఎన్ కౌంటర్ జరిగే చోట పోలీసులు సైతం తమకు రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇళ్లను అండగా చేసుకుంటారు. కానీ, యువకులు మాత్రం రాళ్లు రువ్వేందుకు వచ్చి ప్రాణాలను పణంగా పెడుతున్నారు’’  అని వైద్ పేర్కొన్నారు.

బుద్గామ్ లో ఇటీవల అల్లర్ల సందర్భంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘ఎన్ కౌంటర్ మొదలైన వెంటనే 300 వాట్సాప్ గ్రూపులు యాక్టివేట్ అవుతున్నాయి. ఒక్కోగ్రూపులో 250 మంది సభ్యులు. దీనికి తోడు ఫేస్ బుక్ ద్వారా యువతను ఎన్ కౌంటర్ జరిగే చోటకు వెళ్లేలా ఉసిగొల్పుతున్నారు. ఈ వాట్సాప్ గ్రూపులపై నిఘా పెట్టాం. చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

More Telugu News