: నవంబరులో మరో ఘన విజయం ఖాయం: అమిత్ షా ధీమా

ఈ సంవత్సరం జరగాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయన్న వాదనలను అమిత్ షా తోసిపుచ్చారు. షెడ్యూల్ ప్రకారమే నవంబరులో ఎన్నికలు ఉంటాయని, వాటిల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలో బీజేపీ ఉందని, ముందస్తు ఎన్నికలు ఖాయమని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత, తొలిసారిగా అహ్మదాబాద్ వచ్చిన అమిత్ షాను, సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ సత్కరించింది.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, నరేంద్ర భాయ్, విజయరథం దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ప్రయాణించిందని, నవంబరులో గుజరాత్ కు వస్తుందని, పార్టీని విజయవంతంగా మరోసారి గెలిపించడం ద్వారా మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. కాగా, గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ 20 ఏళ్లలో మోదీ, 13 సంవత్సరాలు పాలన సాగించారు. ఇటీవలి కాలంలో పటేల్ వర్గం నిరసనలు, దళితులకు ఎదురవుతున్న వేధింపులు, వరుసగా అధికారంలో ఉన్నందున ప్రజల్లో సహజంగానే ఏర్పడిన వ్యతిరేకత బీజేపీకి అడ్డుగోడలుగా నిలవనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News