: ముస్లింలు మా పార్టీ ఆఫీస్ లో చెత్త ఊడిస్తే.. పార్టీ టికెట్ ఇస్తాం: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలు తమ పార్టీ కార్యాలయంలో చెత్త ఊడిస్తే... రాబోయే ఎన్నికల్లో వారికి పార్టీ టికెట్ ఇస్తామని కర్ణాటక శాసనమండలిలో బీజేపీ నేత ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ హర్షద్ రిజ్వాన్ మాట్లాడుతూ... బీజేపీలో ఎంత మంది ముస్లింలకు టికెట్ లు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ చెత్త ఊడిస్తే టికెట్ ఇస్తామని ఈశ్వరప్ప చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం తన మాటలను సరిదిద్దుకునే ప్రయత్నాన్ని ఈశ్వరప్ప చేశారు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి చేసింది ఎవరు? జార్జ్ ఫెర్నాండెజ్ ను కేంద్ర మంత్రిని చేసింది ఎవరు? అంటూ సర్దుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కల్పించుకుని... మొదటి నుంచి కూడా ముస్లింలకు బీజేపీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. మైనారిటీలకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకే అని అన్నారు. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని... ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.

More Telugu News