: కేంద్ర మంత్రిని ప్రశ్నించిన ధోనీ భార్య!

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఇటీవల తన ఆధార్ సమాచారాన్ని అప్ డేట్ చేసుకున్నాడు. దీని కోసం కామన్ సర్వీసెస్ సెంటర్ సేవలను ఉపయోగించుకున్నాడు. దీంతో, ఆ విభాగం వాళ్లు దాన్ని ఫొటో తీసుకుని, ప్రచారం కోసం వాడుకున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే వాళ్లు ధోనీ ఫొటోతో పాటు, ఆయన దరఖాస్తు ఫొటోను కూడా ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. దీంతో, ధోనీ భార్య సాక్షికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ట్యాగ్ చేస్తూ... తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరిచే అధికారం ఎవరిచ్చారంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిశంకర్ ప్రసాద్ కూడా ధోనీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకుంటున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంటనే స్పందించారు. తాను పెట్టిన ఫొటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ఆయన ప్రశ్నించారు. అయితే, సీఎస్ సీ గవర్నెన్స్ వారు చేసిన ట్వీట్ లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి కేంద్ర మంత్రికి సాక్షి పంపించారు. దీంతో, జరిగిన తప్పును ఆయన గ్రహించారు. జరిగిన దానిపై చర్యలు తీసుకుంటామని సాక్షికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు సాక్షికి ధన్యవాదాలు తెలిపారు. తనకు సరైన సమాధానం ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సాక్షి థ్యాంక్స్ తెలిపారు. 

More Telugu News