: పారిస్ లో చైనా పౌరుడిని కాల్చి చంపిన పోలీసులు... పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట హింసకు దిగిన చైనీయులు
గత ఆదివారం తమ ఇరుగుపొరుగు వారితో ఘర్షణ పడుతున్న నేపథ్యంలో 56 ఏళ్ల చైనా పౌరుడిని అతడి ఇంటి ముందే పారిస్ పోలీసులు కాల్చిచంపారు. అయితే, తమ దేశీయుడిని కాల్చి చంపడంపై చైనీయులు పారిస్ లో ఆందోళనలు చేస్తున్నారు. అక్కడి డిస్ట్రిక్ట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట వారు హింసకు దిగడంతో కలకలం చెలరేగింది. ఆందోళనకారులు అక్కడి వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనపై అక్కడి పోలీసులు మాట్లాడుతూ కాల్పుల్లో మృతి చెందిన సదరు చైనా వ్యక్తి కత్తెర్లతో దాడి చేయడంతోనే అతడిపై కాల్పులు జరపామని చెప్పారు. అయితే, పోలీసులు చెబుతున్న కారణాలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. పోలీసులు అక్కడకు రావడానికి ముందు ఆ వ్యక్తి కత్తెర్లతో చేపలు కోశాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ తమ దేశ పౌరుడిని కాల్చిచంపిన ఘటనపై దర్యాప్తు జరపాలని ఫ్రాన్స్ రాయబారిని కోరింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.