: నా తరపున, జనసేన సైనికుల తరపున ఉగాది శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్

కొత్త తెలుగు సంవత్సరం ‘హేమలంబ’ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరికీ, దేశ ప్రజలకు తన తరపున, జనసేన సైనికుల తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రకృతి అనుకూలించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అభివృద్ధి పథంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

గడచిన దుర్ముఖి నామ సంవత్సరం తమకు పెద్దగా మేలు చేయలేకపోయిందన్న భావనతో ఉన్న తెలుగు ప్రజల ఆశలు హేమలంబ వసంతంలో నైనా నెరవేరాలని ఆశిస్తున్నానని, రాష్ట్ర విభజన నాటి హామీలు సంపూర్ణంగా అమలు కావాలన్న ప్రజల కోరిక ఫలించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. రైతులు, చేనేత కళాకారులు, శ్రామిక వర్గాలతో పాటు దేశంలోని ప్రతి కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలను హేమలంబ నామ సంవత్సరం ప్రసాదించాలని జనసేనాని పవన్ కోరుకున్నారు.

More Telugu News