: రాహుల్ కఠిన నిర్ణయాలు.. వృద్ధ నేతల స్థానంలో యువకులకు పగ్గాలు!

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌లో పెను మార్పులకు కారణమవుతోంది. పార్టీ ప్రక్షాళన దిశగా సాగుతోంది. పార్టీలోని వృద్ధ నేతలను తప్పించి పార్టీ కోసం అంకితమైన యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన జట్టును తయారు చేయాలని రాహుల్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వృద్ధనేతలకు రాంరాం చెప్పాలని నిర్ణయించారు.

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఘోరంగా విఫలమయ్యారని భావిస్తున్న రాహుల్ పార్టీకి భారంగా మారిన నేతలను వదిలించుకోవాలని నిర్ణయించినట్టు జన్‌పథ్ వర్గాలు చెబుతున్నాయి. చికిత్స కోసం విదేశాలకు వెళ్లి ఇటీవల భారత్ తిరిగొచ్చిన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాహుల్ ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని నియమించాలని భావిస్తున్న అధిష్ఠానం.. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సహా పార్టీ అనుబంధ విభాగాలకు ఈసారి కొత్త వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాహుల్ తన సొంత టీంతో సర్వే సైతం నిర్వహించినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించి పదవులు ఇవ్వాలన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. దీంతో భారీ మార్పులకు రాహుల్ సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News