: నేటి నుంచి ఇండియన్ ఓపెన్.. ఫేవరెట్లుగా సింధు, సైనా!

భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా  నెహ్వాల్‌లు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. బుధవారం మెయిన్ డ్రా మొదలు కానుండగా నేడు (మంగళవారం) జరగనున్న అర్హత మ్యాచ్‌లతో టోర్నీ ఆరంభం కానుంది. సింధుకు మూడు, సైనా ఆరో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో వీరిద్దరూ ఒకే పార్శ్వంలో ఉండడం గమనార్హం.

సింధు, సైనా నెహ్వాల్‌లు తొలి రెండు రౌండ్‌లను అధిగమిస్తే శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఒకరికొకరు ఎదురుపడే అవకాశం ఉంది. ఇక తొలి రౌండ్‌లో చియాసిన్ లీ (చైనీస్ తైపీ)తో ఆరోసీడ్ సైనా, సింగపూర్‌కు చెందిన జియవొయు లియాంగ్‌తో మూడో సీడ్ సింధు పోటీపడతారు. మరోవైపు రియో ఒలింపిక్స్‌ విజేత కరోలినా మారిన్‌ (స్పెయిన్‌),  హ్యున్‌ సంగ్‌, యమగూచి, రచనోక్‌ లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు కూడా టైటిల్‌ మీద కన్నేశారు. కాగా, అంతర్జాతీయ వేదికల్లో సైనా, సింధులు గతంలో ఒకసారి మాత్రమే తలపడ్డారు. 2014లో జరిగిన సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ విజయం సాధించింది.

More Telugu News