: రోజుకో మలుపు తిరుగుతున్న దుప్పుల వేట కేసు.. ఒంగోలులో నిందితులు!

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటాడిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు లొంగిపోగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ భూస్వామి ఇంటిలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 9 మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

కీలక నిందితుడు (ఎ4) అక్బర్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. ఘటన తర్వాత అక్బర్‌ఖాన్ ఐదు రోజుల పాటు మహదేవపూర్‌లోనే ఉన్నాడు. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి విచారణను వేగవంతం చేయడంతో గత శుక్రవారం రాత్రి నలువాల సత్యనారాయణ, అస్రార్‌ఖాన్, ఖలీముల్లా ఖాన్‌లు లొంగిపోయారు. ఆ తర్వాత నుంచి అక్బర్‌‌ఖాన్‌ కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులు ఒంగోలులోని ఓ భూస్వామి వద్ద తలదాచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

నిందితులను పట్టుకునేందుకు పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో ఫజల్‌ మహ్మద్‌ ఖాన్‌ కోసం ఓ బృందం గాలిస్తుండగా, గోదావరిఖని, సెంటినరీ కాలనీకి చెందిన నిందితుల కోసం మరో బృందం రంగంలోకి దిగింది. ఇంకో బృందం మున్నా కోసం గాలిస్తోంది. ఏ1 నిందితుడు సత్యనారాయణతోపాటు అతని బంధువు కూడా దుప్పుల వేటలో పాల్గొన్నట్టు పోలీసులు రికార్డుల్లో పేర్కొన్నారు.

More Telugu News