: ఆ భవనంలోనే దేశ విభజన కుట్రల‌కు బీజం పడింది.. దానిని కూల్చాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

పాకిస్థాన్ జాతి పిత మ‌హ్మ‌ద్ అలీ జిన్నా ప్యాలెస్ దక్షిణ ముంబయిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ ప్యాలెస్‌ను కూల్చండంటూ ముంబయికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్‌ మంగల్‌ ప్రభాత్‌ లోధా డిమాండ్‌ చేశారు. ఆ ప్ర‌దేశంలో ఓ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాల‌ని అన్నారు. ఈ రోజు ఆయ‌న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ... ఈ ప్యాల‌స్‌లోనే దేశ విభజన చేయాల‌న్న‌ కుట్రల‌కు బీజాలు ప‌డ్డాయ‌ని తెలిపారు. ఆ నివాసం విభజనకు ప్రతీక అని, అందుకే ఆ నిర్మాణాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు.


 అత్యంత విలాసవంతంగా రూపొందిన ఈ ప్యాల‌స్‌లో 1982 వరకు బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నివసించారు. అనంత‌రం దాన్ని ఎవ్వ‌రూ ఉప‌యోగించ‌డం లేదు. ప్రస్తుతం ఇది చాలావరకు శిథిల దశకు చేరుకుంది. తాజాగా కేంద్ర స‌ర్కారు ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ భవనం సర్కారు ఆస్తి అవుతుందని స‌ద‌రు ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్యాలెస్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో సముద్రానికి అభిముఖంగా యూరోపియన్‌ శైలిలో నిర్మితమై ఉంది. ఈ భవనం విలువ రూ. 2600 కోట్లకు (400 మిలియన్‌ డాలర్ల)కు పైగా ఉంటుంది.

More Telugu News