: టీమిండియా సంబరాలు... కోహ్లీకి కోపమొచ్చింది!

చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు దూకుడుగా ఆడారు. అద్భుతమైన బంతులతో ఆసీస్ బ్యాట్స్ మన్ ను ఇరుకునపెట్టారు. తొలిసారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రాణించి, ఆసీస్ ను ఆత్మరక్షణలోకి నెట్టారు. పేస్, బౌన్స్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా ఆటగాళ్లు సాధికారిక ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు తీస్తూ ఆకట్టుకున్న బౌలర్లు 53.3 ఓవర్లలో మురళీ విజయ్ పట్టిన క్యాచ్ తో ఆసీస్ ఆటకట్టిందని భావించి, సంబరాలు చేసుకున్నారు. పలువురు ఆటగాళ్లు ఏకంగా బౌండరీ లైన్ దాటేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇంతలో ఆసీస్ ఆటగాళ్లు రివ్యూ కోరారు. దీంతో అంపైర్ రీ ప్లేను పలుమార్లు చూశారు. ఇందులో మురళీ విజయ్ చేతుల్లో బంతి ఇమిడిపోయినప్పటికీ నేలను తాకినట్టు కనిపించింది. ధర్మశాల పిచ్ పై పచ్చిక ఉండడంతో పచ్చిక కారణంగా అలా కనిపించింది. వాస్తవానికి బంతికి నేలకి మధ్యలో మురళీ విజయ్ చేతి వేలు ఉంది. అయినప్పటికీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దానిని పలు మార్లు రివ్యూ చూసిన కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. ఔట్ ను నాటౌట్ అంటాడేంటని ఆశ్చర్యపోయాడు. తరువాత అదే ఓవర్ లో 5వ బంతికి అశ్విన్ హేజిల్ వుడ్ ను అవుట్ చేయడం ద్వారా ఆసీస్ ను ఆలౌట్ చేశాడు. దీంతో ఈసారి టీమిండియా మౌనంగా మైదానం వీడింది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. కుమ్మిన్స్ ఆసీస్ బౌలింగ్ దాడిని ప్రారంభించాడు. తొలి ఓవర్ లో మూడు ఫోర్లు బాది టీమిండియా బ్యాటింగ్ దాడిని కేఎల్ రాహుల్ ప్రారంభించాడు. 

More Telugu News