: జియో ప్రైమ్ గడువు పొడిగింపు!
మరో నాలుగు రోజుల్లో జియో ప్రైమ్ సభ్యత్వానికి రిలయన్స్ ప్రకటించిన గడువు ముగుస్తుందనగా, దీన్ని మరో నెల పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఏప్రిల్ 30 వరకూ జియో ప్రైమ్ గడువును పొడిగించాలని సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రైమ్ సభ్యత్వాలను ఆకర్షించడంలో జియో వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రూ. 99 వన్ టైం ఫీజుగా చెల్లించేందుకు గడువును పెంచుతూ, అమల్లోని ఆఫర్లను 2018 వరకూ అందించాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి పోటీలో ఉన్న సంస్థలతో పోలిస్తే, జియో కస్టమర్లు 20 శాతం ఎక్కువ డేటాను, మంచి ఆఫర్లను పొందుతారని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.