: ఆర్టీఏ కార్యాలయం ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం!: కేశినేని నాని, బొండా ఉమ

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో నిన్న చోటుచేసుకున్న ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, జరిగిన ఘటనపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు వివరణ ఇచ్చామని చెప్పారు. వ్యక్తిగత కక్షతో తాము ప్రభుత్వోద్యోగితో దురుసుగా మాట్లాడలేదని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ లా తామెవరినీ దూషించలేదని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, తామేమీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లలేదని అన్నారు. ప్రజాసమస్యపై మాట్లాడేందుకు వెళ్లామని చెప్పారు. ఒకవేళ నిన్న చోటుచేసుకున్న ఘటన పట్ల ఎవరైనా నోచ్చుకుని ఉంటే క్షమించాలని ఆయన అన్నారు. ఉద్యోగులతో తమకు వైరం లేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, 'ఆరెంజ్' బస్సులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారి సుబ్రహ్మణ్యం గన్ మన్ తో బొండా ఉమ వాగ్వాదానికి దిగి అతని గుండెమీద చెయ్యేసి వెనక్కి తోయడం జరిగింది. దీనిపై పెను దుమారం రేగింది. మీడియాలో దీనిపై వార్తలు రావడంతో నేడు క్షమాపణలు చెప్పారు. 

More Telugu News