: పట్టాలెక్కిన కలల బండి.. పెద్దపల్లి-నిజామాబాద్ రైలును ప్రారంభించిన రైల్వేమంత్రి

ఎట్టకేలకు పెద్దపల్లి-నిజామాబాద్ రైలు బండి పట్టాలెక్కింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9 గంటలకు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు శనివారం ఈ రైలును రిమోట్ ద్వారా ప్రారంభించారు. అలాగే దక్షిణమధ్య రైల్వేలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్, నిజామాబాద్-మోర్తాడ్, దేవరకద్ర-జక్లేర్ మధ్య కొత్త లైన్లతోపాటు మహబూబ్‌నగర్‌- దేవరకద్ర-జక్లేర్‌ మధ్య డెమో ప్యాసింజర్‌ను  జెండా ఊపి ప్రారంభించారు.

అలాగే నాంపల్లిలో 225 కేడబ్ల్యూపీ సోలార్‌ పవర్‌ప్లాంట్‌, సికింద్రాబాద్‌ ఆలుగడ్డ బావి పునరుద్ధరణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  సురేశ్ ప్రభు మాట్లాడుతూ కొత్త రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 10 రైల్వే స్టేషన్లను ‘డిజి పే’ స్టేషన్లుగా ప్రకటించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్‌ ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News