: మాట్లాడుకుందాం రమ్మని... ఖరీదైన ఫోన్ తో ఉడాయించిన 'ఫేస్ బుక్' ప్రేయసి!

ఫేస్‌ బుక్‌ ప్రేమల సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట బయటపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలో కూడా ఫేస్ బుక్ ప్రేమ తన అసలు రంగు బయటపెట్టుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... పాత గుంటూరుకు చెందిన ఎల్‌ఎల్‌బీ చదువుతున్న యువకుడు ఫేస్‌ బుక్‌ లో యువతికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపాడు. అనంతరం వారి మధ్య పరిచయం పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరూ కలుసుకోవాలనుకున్నారు. దీంతో ఆ యువతి అతనిని జేకేసీ కళాశాల రోడ్డులోని ఖాళీ స్థలం దగ్గరకి రమ్మంది.

దీంతో అతను అక్కడికి చేరుకున్నాడు. అతనిని కలిసే సమయంలో ఆమె తన ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంది. దీంతో ఎవరైనా చూస్తారని అలా స్కార్ఫ్ కట్టుకుందని భావించిన యువకుడు దానిని తీయమని బలవంతం చేయలేదు. దీంతో అతనితో కాసేపు మాట్లాడిన యువతి అతని చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ ను అడిగి తీసుకుంది. అతను ఆదమరపుగా ఉండగా, ఆ ఫోన్ తీసుకుని తన స్కూటీపై ఉడాయించింది. తరువాత తన బైక్ తో ఆమెను పట్టుకునేందుకు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో లబోదిబోమంటూ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆమె స్కూటీ నెంబర్ కూడా నోట్ చేసుకోలేదని, ఫేస్ బుక్ లో కూడా ఆమె ఫోటో పెట్టలేదని వాపోయాడు. 

More Telugu News