: చికెన్‌ఫ్రై చేసి పెడతానన్నాడు.. భార్య ముఖంపై సలసల కాగుతున్న నూనె పోశాడు!

త‌న భార్య‌పై ఓ భ‌ర్త మ‌సిలిపోయే నూనె పోసిన ఘ‌ట‌న ముంబ‌యిలోని అజ్మీనగర్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆమె ముఖం 65 శాతం పైగా కాలిపోయింది. అనంత‌రం ఆ భర్త‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ప‌లు వివ‌రాలు తెలిపారు. ముంబయికి చెందిన షదాబ్‌ అలీ ఇర్షాద్‌ షేక్‌ (31), మరియం మధ్య మనస్పర్థలు వ‌చ్చాయ‌ని, దీంతో రెండు నెలలుగా వారు విడివిడిగా ఉంటున్నారని చెప్పారు. అయితే, ఇర్షాద్ షేక్ భార్య‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. దాంతో, ఆమెపై కోపం పెంచుకున్న భర్త షేక్.. అజ్మీనగర్‌లో ఆమె ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లి, ‘విడాకులు తీసుకోబోతున్నాం కదా.. ఆఖ‌రి సారిగా హ్యాపీగా గడుపుదాం’ ‌అని చెప్పాడ‌ని అన్నారు.

ఆమెకు స్వయంగా చికెన్‌ ఫ్రై చేసి పెడతానని చెప్పిన షేక్ త‌న భార్య‌ను త‌న‌ ఇంటికి పిలిచాడని పోలీసులు చెప్పారు. అయితే, ఆమె ఇంటికి రాగానే చికెన్‌ ఫ్రై చేసేందుకు వేడి చేసిన నూనెను ఆమె ముఖంపై పోశాడని వివ‌రించారు. వారిద్ద‌రికీ ఓ కొడుకు కూడా ఉన్నాడ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

More Telugu News