: ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ మనోహర్లాల్శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించి, అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్టులతో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై ఈ రోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సీబీఐ విచారణకు మాత్రం ఆదేశించలేమని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన ఈసీ ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని మరోసారి చెప్పింది.