: జయలలిత మేనకోడలు దీప వెల్లడించిన ఆస్తుల వివరాలు!
వచ్చే నెల 12న దివంగత ముఖ్యమంత్రి జయలలిత సొంత నియోజకవర్గమైన తమిళనాడులో ఆర్కే నగర్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలో తన ఆస్తుల విలువ 3.05 కోట్ల రూపాయలని తెలిపారు. ఇందులో రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, 1.05 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే ఈ ఆస్తులపై 2016-17 వార్షిక సంవత్సరానికి గాను తనకు 5.37 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడాది 17.50 లక్షల రూపాయలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని చెప్పిన ఆమె, ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో తాను బ్యాంకులకు 6.15 లక్షల రూపాయల లోన్ చెల్లించాల్సివుందని తెలిపారు. తనకు తెలిసిన ముగ్గురి నుంచి 70.65 లక్షల రూపాయల అప్పు తీసుకున్నానని వెల్లడించారు. 2016లో 50,390 రూపాయలు వెచ్చించి ఓ స్కూటర్ కొనుగోలు చేశానని, అంతే కాకుండా తనకు 23.80 లక్షల రూపాయల విలువైన 821 గ్రాముల బంగారం, 1.72 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలతో పాటు 4 లక్షల విలువైన 20 కేరట్ వజ్రాభరణాలు కూడా ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. తన చేతిలో ప్రస్తుతం 3.50 లక్షల రూపాయల నగదు ఉందని చెప్పిన ఆమె తన బ్యాంకు అకౌంట్ లో 1.77 లక్షల రూపాయల సేవింగ్ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.