: తన ప్రాంత మాజీ కలెక్టర్ ను పిలిపించి కీలక బాధ్యతలు అప్పగించిన యోగి ఆదిత్యనాథ్!

గతంలో కలెక్టరుగా పనిచేస్తున్న వేళ, తన మనసు గెలుచుకున్న ఓ అధికారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరి కోరి తనకు ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ శాఖలో సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అవనీష్ కుమార్ అవస్థిని తన రాష్ట్రానికి తిరిగి పంపించాలని ఆయన చేసిన విజ్ఞప్తికి కేంద్ర పరిపాలనా శాఖ ఆమోదం పలికింది. ఆయన్ను రిలీవ్ చేసే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు.

కాన్పూర్ ఐఐటీలో గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన అవస్థి, యూపీలో ఎంతో కాలం పని చేశారు. లలిత్ పూర్, అజాంఘడ్, బదౌన్, ఫైజాబాద్, వారణాసి, మీరట్, గోరఖ్ పూర్ తదితర జిల్లాల్లో కలెక్టర్ గా సేవలందించారు. ఆదిత్యనాథ్ సుదీర్ఘకాలంగా గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రాంతంలో కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆయన వైఖరి, నిబద్ధత, పాలనా నిర్ణయాల అమలులో వేగం తదితరాలను చూసిన ఆదిత్యనాథ్, ఇప్పుడు ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టును ఆఫర్ చేశారు.

More Telugu News