: చంద్రబాబునాయుడు రైతులను మోసం చేశారు!: సీఎంపై మండిపడ్డ జగన్

రుణమాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు తన మాటకు కట్టుబడలేదని, రైతులను మోసం చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. గుంటూరు మిర్చియార్డులో రైతులతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. మిర్చికి కనీస మద్దతు ధర లభించడం లేదని, నకిలీ విత్తనాలు ఇచ్చారని, దళారులందరూ కుమ్మక్కయ్యారంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం, జగన్ మీడియాతో మాట్లాడుతూ, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, బ్యాంకు రుణాలు చెల్లించడం లేదంటూ రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన నాణ్యమైన విత్తనాలను కిలో రూ.లక్ష చొప్పున బ్లాక్ లో విక్రయిస్తున్నారని, మార్కెట్ లో కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News