: శవపేటికపై ఊరేగుతూ వెళ్లి నామినేషన్ వేసిన అభ్యర్థి... కంగారుపడ్డ స్థానికులు!

చెన్నైలో ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి వినూత్నమైన శైలిలో తన నామినేషన్ దాఖలు చేశాడు. ఆర్కేనగర్ నుంచి బరిలోకి దిగిన హిందూ మక్కల్ కట్చి పార్టీకి చెందిన రవికుమార్ అనే అభ్యర్థి శవ పేటికపై ఊరేగుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి తన నామినేషన్ సమర్పించారు. అయితే, శవపేటికపై ఉన్న రవికుమార్ ను చూసిన చుట్టుపక్కల వారు కంగారు పడిపోయారు. దీనికి తోడు, ఆ పార్టీ కార్యకర్తలు మద్యం బాటిళ్లను తమ మెడలో ధరించి, ఆయన పడుకున్న శవపేటికను ఈడ్చుకుపోతుండడంతో ఏం జరిగిందో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు.

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న స్థానికులు నవ్వుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, తమిళనాడులో ఒక పక్క మంచి నీరు దొరకక అల్లాడుతుంటే, మద్యం మాత్రం ఏరులై పారుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై తమ నిరసన వ్యక్తం చేస్తూ ఇలా శవ పేటికలో పడుకుని నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు.

More Telugu News