: నాలుగేళ్ల నుంచి బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న తల్లీ కూతుళ్లు... ఆసుపత్రికి తరలింపు!

నాలుగేళ్లుగా తమను తాము బంధించుకుని గదిలోనే ఉండిపోయిన తల్లీకూతుళ్లను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని మహావీర్‌ ఎన్‌ క్లేవ్‌ ప్రాంతంలో మహావీర్ మిశ్రా, అతని కోడలు కళావతి(42), ఆమె కుమార్తె దీప (20) నివాసం ఉంటున్నారు. 2002లో మిశ్రా భార్య మరణించగా ఆయన ఇద్దరు కుమారులు నాలుగేళ్ల క్రితం 2013లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురైన కళావతి, దీపలు తమను తాము ఇంట్లోని ఓ గదిలో బంధించుకున్నారు. వారు అడిగినప్పుడు రోజులో ఒకసారి మిశ్రా వారికి భోజనం ఏర్పాటు చేసేవారు.

అప్పుడప్పుడు తన కుమారులతో మాట్లాడుతున్నామని తల్లీకూతురు చెప్పేవారని ఆయన అన్నారు. ఒక్కోసారి కొన్ని రోజులపాటు భోనం చేయకుండా ఉండేవారని ఆయన చెప్పారు. స్థానికంగా ఉండే వైద్యుడికి ఓసారి చూపించానని చెప్పిన ఆయన, ఎంటీఎన్ఎల్ లో లైన్ మెన్ గా పని చేసిన తాను, రిటైర్ అయిన తరువాత వస్తున్న పెన్షన్ తో జీవిస్తున్నానని, వారిని మంచి ఆసుపత్రిలో చేర్పించేందుకు తనవద్ద తగిన డబ్బు లేదని తెలిపారు. దీంతో ఇరుగు పొరుగు ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆ తల్లీకుతుళ్ళను బయటకు తీసుకొచ్చారు. వారిద్దరూ బలహీనంగా మారిపోవడంతో  వారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారున్న గది కూడా చాలా అపరిశుభ్రంగా ఉందని పోలీసులు చెప్పారు. 

More Telugu News