: 'నీకు నువ్వుగా చచ్చిపో...లేదా.. మేమే చంపేస్తాం!' అంటూ యువతికి బెదిరింపులు

నీకు నువ్వుగా చచ్చిపో లేదా మేమే చంపేస్తాం అంటూ హైదరాబాదులోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతిని బెదిరించిన ఘటన చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... మెట్టుగుడ ఆలుగడ్డబావి ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి (20)ని అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కేసులు కూడా నమోదు చేసుకున్నారు. అనంతరం రాజీకి వచ్చారు.

అయితే, ఈనెల 16న ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రశాంత్ కు నివాళిగా బంధుమిత్రులు ఈనెల 30న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ యువతి ఇంటివద్దకు చేరగానే... సునీత, సాయి అలియాస్‌ బుట్ట, భరత్‌ ఆమె ఇంట్లోకి చొరబడి 'ప్రశాంత్‌ మరణానికి కారణం నువ్వే'నంటూ దూషిస్తూ ఆమెపై కిరోసిన్ పోశారు. అనంతరం ఆమె తల్లిపై దాడికి దిగారు. ఆ తరువాత 'నీకు నువ్వుగా చచ్చిపో.. లేదా మేమే చంపేస్తా'మంటూ హెచ్చరించారు. దీంతో ఆందోళన చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

More Telugu News