: ముస్లిం విద్యార్థినికి అండగా నిలిచిన మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ స్పందన ఓ ముస్లిం విద్యార్థిని జీవితానికి బంగారు బాటలు వేసింది. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని మండ్యా జిల్లా షుగర్ టౌన్ ప్రాంతానికి చెందిన బీబీ సారా (21) అనే విద్యార్థిని ఉన్నత చదువులకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. ఎంబీఏ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ కోసం అన్ని బ్యాంకుల చుట్టూ ఆమె తిరిగింది. కానీ, ఆమెకు లోన్ ఇవ్వడానికి ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాలేదు. దీంతో, తనకు విద్యా రుణం ఇప్పించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది.

పది రోజుల తర్వాత ఆమెకు ప్రధాని నుంచి సమాధానం వచ్చింది. అంతేకాదు, ఆమెకు వెంటనే విద్యా రుణం ఇప్పించాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రధాని నుంచి ఆదేశాలు అందాయి. దీంతో, ఆమెకు ఆగమేఘాల మీద రుణం మంజూరయింది. విజయాబ్యాంకు ఆమెకు రూ. 1.5 లక్షల విద్యా రుణం మంజూరు చేసింది.

ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ, ప్రధాని తన సమస్య పట్ల స్పందిస్తారనే తాను భావించానని... అయితే, ఇంత తొందరగా స్పందిస్తారని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది. ఆమె తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తె చదువుకు సాయం చేసిన ప్రధానికి రుణపడి ఉంటామని చెప్పారు.

More Telugu News