: 19 మంది ఎమ్మెల్యేలను 9 నెలల పాటు సస్పెండ్ చేసిన మహారాష్ట్ర స్పీకర్!


మహారాష్ట్ర శాసనసభలో గందరగోళం సృష్టించిన 19 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. వీరందరినీ ఏకంగా 9 నెలల పాటు సస్పెండ్ చేస్తూ, అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగాడే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయినవారు ఎవరూ డిసెంబర్ 31 వరకు సభలో అడుగు పెట్టకూడదంటూ ఆయన ఆదేశించారు.

బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ నెల 18న కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్ పాఠాన్ని ఆర్థికమంత్రి చదువుతున్న సమయంలో... మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బడ్జెట్ ప్రసంగం వినపడకుండా... గట్టిగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల వైఖరిని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కూడా సభలో తప్పుబట్టారు. ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, విపక్ష సభ్యుల క్రమశిక్షణారాహిత్యాన్ని స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు. 19 మంది సభ్యులను సభ నుంచి 9 నెలల పాటు సస్పెండ్ చేశారు. 

More Telugu News