: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఉపాధ్యాయులు, పట్టభద్రులు!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ షాక్ ఇవ్వగా... టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ, పీడీఎఫ్ షాక్ ఇచ్చాయి. మొత్తం ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ ఓటమిపాలయింది. ఏపీలోని 9 తొమ్మిది జిల్లాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. వీటిలో 2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల స్థానాలు ఉన్నాయి.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిలో టీడీపీ ఓటమిపాలైంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం చేతిలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు ఓటమిపాలయ్యారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్యను పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ఓడించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే... మూడు స్థానాల్లో టీడీపీ ఒకటి, వైసీపీ ఒకటి, వామపక్షాలు ఒకటి సొంతం చేసుకున్నాయి. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి (వైసీపీ మద్దతిచ్చింది) గెలుపొందారు. పశ్చిమ రాయలసీమలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో బీజేపీ-టీడీపీల ఉమ్మడి అభ్యర్థి పీవీఎన్ మాధవన్ గెలుపొందారు. ఏదేమైనప్పటికీ, మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని కోల్పోవడం టీడీపీకి ఇబ్బంది కలిగించే అంశమే.

More Telugu News