: వైకాపా మహిళా ఎమ్మెల్యేలను లాగేసిన మార్షల్స్

ఏపీ అసెంబ్లీలో మీడియా పాయింట్ సాక్షిగా, తెలుగుదేశం, వైకాపాల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. మీడియా పాయింట్ లో వైకాపా మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న వేళ, అక్కడికి టీడీపీ ఎమ్మెల్యే అనిత రావడంతో రభస మొదలైంది. ఆపై మైకులు వీడేందుకు వైకాపా ఎమ్మెల్యేలు నిరాకరించడంతో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు లేడీ మార్షల్స్ తో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. తమ మహిళా ఎమ్మెల్యేలకు రక్షణగా వైకాపా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో పరిస్థితి విషమించింది.

ఒక దశలో మహిళా శాసనసభ్యులు ఒకరిని ఒకరు తోసుకుంటూ, మైకులు లాక్కుంటూ కనిపించారు. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆపై మార్షల్స్ సాయంతో వైకాపా ఎమ్మెల్యేలను లాగేశారు. ఆ సమయంలో గిడ్డి ఈశ్వరి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, తమపై కండబలం చూపుతున్నారని, పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. "నన్ను తాకొద్దు. నేనేం తప్పు చెయ్యలేదు" అని అరుస్తూ మార్షల్స్ పై విరుచుకుపడ్డారు. వైకాపా సభ్యులను అక్కడి నుంచి మార్షల్స్ తరలించగా, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.

More Telugu News